ఆడ శిశువు విక్రయాన్ని అడ్డుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారులు

నవతెలంగాణ – సిద్ధిపేట్
పట్టణ శివారులోని బూర్గుపల్లి గ్రామ శివారు వద్ద ఒక్కరోజు వయసు గల ఆడ శిశువును రూ 20 వేలకు విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో బాలల పరిరక్షణ విభాగం అధికారులు ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజు, శిశుగృహ మేనేజర్ ఝాన్సీ, శిశు గృహ సామాజిక కార్యకర్త రాజారాం వెంటనే బాల రక్షక వాహనంలో విక్రయిస్తున్న స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ విషయంపై విచారణ చేసి, వారిని అడగగా మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి చెందిన గొడుగు మంజుల తన ఒక్కరోజు వయసుగల పాపని, గజ్వేల్ లో నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎండి జామిన్ మరియు ముంతాజ్ దంపతులకు విక్రయిస్తున్నట్లు తెలిపిందని తెలిపారు.  ఇటీవల గొడుగు మంజుల భర్త అనారోగ్యంతో మరణించాడని, ఈ పాప నాలుగో సంతానం కావడంతో పోషించలేక అమ్ముతున్నాను అని, ఆమె సన్నిహితులు దగ్గరి బంధువులు చెప్పడం జరిగిందని తెలిపారు. రెస్క్యూ చేసిన పాపను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నవారు, పిల్లలను జిల్లా బాలల పరిరక్షణ విభాగం కు అప్పగించినచో వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని వారు తెలిపారు. అదేవిధంగా పిల్లలు లేని దంపతులు ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలను అక్రమంగా తీసుకోకూడదని, ఒకవేళ తీసుకున్న యెడల మానవ అక్రమ రవాణా చట్టం క్రింద శిక్షార్హులు అని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము తెలిపారు.