మీడియా సెంటర్ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, యస్.పీ.

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎన్నికలు పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలి.ఎన్నికలకు మీడియా సహకారం అందించాలి. ఎన్నికల సమాచారం మీడియా సెంటర్ ద్వారా అందుకోవాలి. నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్.పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాలెక్టరేట్ లోని రూమ్ నెం.జి..4 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ నీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, యస్.పి. రాహుల్ హెగ్డే లు కలసి ప్రారంభించారు. బుదవారం మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్, యస్.పి కలసి పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలు వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ, మంజూరు చేయాలని సూచించారు. శాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు మీడియా సహకారం అవసరమని అన్నారు. అనంతరం యస్.పి. మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు , ప్రకటనలు ప్రసారం చేయవద్దని అట్టి వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, అదనపు యస్.పి.నాగేశ్వర రావు,డిపిఆర్ఓ రమేష్ కుమార్, డి.ఐ.ఈ. మల్లేశం, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, మీడియా మిత్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.