ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: జిల్లా జడ్జి వెల్లడి

నవతెలంగాణ – కంటేశ్వర్
35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024 అవగాహన కార్యక్రమములో భాగంగా మంగళవారం జిల్లాలోని మేఘన ఇన్సిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ హాస్పటల్ నుండి ఏర్పాటు చేయబడిన ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీ అవగాహణ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిధులుగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  సునీత కుంచాల నిజామాబాద్ పోలీస్ కమీషనర్  కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్., హాజరు అయి జండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రభుత్వ హస్పటల్ నుండి ప్రారంభమై ఆర్.టి.సి బస్టాండ్ తిలక్ గార్డెన్ రైల్వే స్టేషన్ – ఎన్.టి.ఆర్ చౌరస్తా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదు అని సూచించారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహణ కార్యక్రమాలే ప్రధానమని, వాహనాదారులు ప్రతీ ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలని రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండాలని అన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని, రోడ్డు ప్రమాదాలలో ముఖానికి లేదా శరీరానికి బలమైన గాయాలు లేదా ఎముకలు విరిగినప్పుడు సర్జరీ ద్వారా బాగు చేయవచ్చని, కాని తలకి గాయం అయితే చాలా కష్టం కాబట్టి హెల్మేటు ధరించకుండా అజాగ్రత్తగా వాహనం నడిపి. తమను నమ్ముకున్న తల్లిదండ్రులకు గర్భశోకం రాకుండా చూడాలని తెలియజేశారు. కావున యువత తప్పకుండా వాహనం నడిపేటప్పుడు హెల్మేటు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.అనంతరం పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయినా ఎంతో మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని రోడ్డు ప్రమాదాల నివారణకోసం వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రధానంగా ద్విచక్ర వాహనాదారులు హెల్మేటు ధరించాలని కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్బెల్టు ధరించాలని, డ్రైవింగ్ చేస్తు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను డాక్టర్లు కాపా డడం జరుగుతుందని, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదాలన వలన దాదాపు 320 మంది మరణిస్తున్నారని 680 మంది క్షతగాత్రులు అవుతున్నారని ప్రతీ సంవత్సరం 320 మంది మరణించడం వలన అట్టి కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారని, కావున వాహనాదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలి. మేఘన డెంటల్ కాలేజీ యందు విధ్యార్థులకు స్పెషల్ డ్రైవ్ ద్వారా రీజినల్ ట్రాన్స్పోర్టు శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతీ ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని అన్నారు.డాక్టర్ సాయిచంద్  మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ముఖానికి తగిలిన గాయాలకు గాను మేఘన దంత వైద్య కళాశాలలో అతితక్కువ ఖర్చుతో అత్యాధునిక పరి- కరాలతో చికిత్స నిర్వహించడం జరగుతుందని తెలిపారు.రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో అని నృత్య ప్రదర్శన ద్వారా విధ్యార్థులు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి హెల్మేట్లు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఎస్. జయ్ రామ్, ప్రొబేషనరీ ఐ.పి.యస్ బి. చైతన్య రెడ్డి ట్రాఫిక్ ఎ.సి.పి  టి. నారాయణ నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, హోమ్ గార్డ్సు ఎ.సి.పి పి.ఆరుణ్ కుమార్, ట్రాఫిక్ సి.ఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ ఆర్.ఐ  సతీష్ డా॥ కళ్యాణ చక్రవర్తి ( వైస్ ప్రిన్సిపాల్) డా॥ అమర్నాధ్ ( హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు), డా॥ ప్రవీణ్ కుమార్ (హెడ్ ఆఫ్ ది డిపార్డుమెంటు ), డా॥ శోభారాణి ( ప్రొఫెసర్), డా॥ సాయిచంద్ ( అసోసియేట్ ప్రొఫెసర్) రమణరావ్ ( ఎ.ఓ), ఐ రాడ్ మేనేజర్ ఎమ్. వర్షా నిహంత్ తదితరులు పాల్గొన్నారు.