– విద్య, వైద్యం, అత్యవసర అంశాల ఫిర్యాదులనే జిల్లలో అందించాలి
-జిల్లా కలెక్టర్ సి .నారాయణరెడ్డి
నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్
తదుపరి వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు సమర్పించాలనుకొనే పిర్యాదుదారులు సంబంధిత మండలాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం కావాలన్న ఉద్దేశ్యంతో గత సోమవారం మొదటిసారిగా మండల స్థాయి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు ఈ వారం సైతం మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే తదుపరి వచ్చే సోమవారం నుండి జిల్లా ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తామని, ఆ ప్రజావాణిలోవిద్య, వైద్యం, అత్యవసర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించాల్సి ఉంటుందని, అలాగే మండల స్థాయిలో పిర్యాదులు సమర్పించి 15 రోజులైనా పరిష్కారం కానివి మాత్రమే జిల్లా స్థాయికి రావాలని, ఆయన పునరుద్గటించారు.భూములు,ధరణి కి సంబంధించిన ఫిర్యాదులు మండల స్థాయిలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకోని ఫిర్యాదులను సమర్పించాల్సిందిగా ఆయన కోరారు.