నవతెలంగాణ-పాల్వంచ రూరల్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అక్కడ ప్రస్తుత పరిస్థితిని ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులను ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, స్టోరేజ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిన్నెరసాని నది పరివాహక లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా కోరారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కిన్నెరసాని నది గేట్లు ఓపెన్ చేసే సమయాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని గురించి సమాచారాన్ని సేకరించి అవసరమైతే అక్కడికి చేరుకొని ప్రజలకు అండగా ఉండాలని తెలియజేసారు. అనంతరం రాజాపురం, యానాంబైలు గ్రామాల మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ను సందర్శించారు.