
నవతెలంగాణ – పెద్దవంగర
రుణమాఫీ ప్రక్రియలో రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టొద్దని టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా తిరిగి అప్పు ఇచ్చే విషయంలో వారికి పూర్తిగా బ్యాంకర్లు సహకరించాలన్నారు. రుణమాఫీ జరిగిన రైతులకు వెంటనే రెన్యూవల్ చేయాలన్నారు. రైతులు రెన్యువల్ చేయడం కోసం తిండి తిప్పలు లేక, వ్యవసాయ పనులను వదులుకొని నెలరోజుల నుంచి బ్యాంకు చుట్టూ రైతులు తిరుగుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రమపద్ధతిలో రుణమాఫీ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ రెన్యువల్ కోసం రైతులు వన్బీ, పాన్కార్డు, ఆధార్ కార్డు, పాస్ ఫొటో తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గురిజాల సోమిరెడ్డి, పెద్ది అనిల్, పెద్ది వెంకన్న, మార్గం సోమన్న తదితరులు పాల్గొన్నారు.