‘నా కెరీర్లో బీజీయస్ట్ ఇయర్ 2025. విభిన్న పాత్రలతో ఇటు థియేటర్లో అటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని నరేష్ విజయ్ కృష్ణ అన్నారు. నేడు (సోమవారం) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,’గత పదేళ్ళుగా యాక్టర్గా మళ్ళీ మెట్టుమెట్టు ఎదుగుతూ వస్తున్నాను. సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్గా 52 ఏండ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ సక్సెస్తో స్టార్ట్ అయ్యాను. ప్రస్తుతం 9 సినిమాలు ఏకకాలంలో షూటింగ్లో ఉన్నాయి. ఇందులో రెండు లీడ్ రోల్స్ చేస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా రెండు పెద్ద కార్యక్రమాలు చేయబోతున్నాను. వాటిల్లో సినిమా మ్యుజియం, లైబ్రైరి అండ్ క్రియేటివ్ స్పెస్ ఫర్ యంగ్ పీపుల్. దీనిని ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించాం. అలాగే జంధ్యాల నా గురువు. ఆయన్ని చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని జంధ్యాల పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ని ఆరంభించాం. దీంతోపాటు జంధ్యాలపై ఓ అద్భుతమైన పుస్తకం తయారు చేశాం. దీనికి సీనియర్ రైటర్ సాయినాథ్ సహకరించారు. ఈ పుస్తకాన్ని అమ్మ విజయనిర్మల పుట్టిన రోజు ఫిబ్రవరి 20న రవీంద్రభారతిలో ఘనంగా లాంచ్ చేస్తున్నాం. అలాగే ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయ కృష్ణ అవార్డ్ని అభిమానుల సమక్షంలో జయసుధకి ఇవ్వబోతున్నాం. జంధ్యాల వజ్రోత్సవ ఉత్సవాల సందర్భంగా యోగిబేర్ కలెక్టీవ్స్ వారి థియేటర్లో జంధ్యాల రాసిన రెండు నాటకాలతోపాటు ఆయన దర్శకత్వం వహించిన మూడు సినిమాలను, అలాగే విజయనిర్మల డైరెక్షన్ చేసిన మూడు సినిమాలను ప్రదర్శించనున్నారు’ అని తెలిపారు.