మూసీ నీళ్లతో స్నానం చేసే దమ్ముందా?

– ఈటలకు ఎంపీ చామల సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మూసీ ప్రక్షాళన అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో జీవిస్తూ…ఆ నీటితో స్నానం చేయాలని సవాల్‌ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు చరణ్‌ యాదవ్‌, చారగొండ వెంకటేష్‌, సంధ్యారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీలోకి పోయి ఈటల రాజేందర్‌ కలుషితమయ్యారనీ, అందుకే ఆయన పాత బాస్‌లను గుర్తు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌ చేస్తామన్న కేటీఆర్‌, హరీశ్‌రావు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌లాగా ప్రసుత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట తప్పే మనిషి కాదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అంటూ గోబెల్స్‌లా తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పదేండ్ల పాలనకు, పది నెలల పాలనకు యుద్ధం జరుగుతున్నదని చెప్పారు.