బీజేపీకి అడ్డదారిలో విరాళాలు

Donations to BJP at crossroads– కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
– వివిధ కంపెనీల నుంచి కోట్లల్లో వసూళ్లు
– న్యూస్‌ పోర్టళ్ళ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా వివిధ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో బీజేపీ విరాళాలు సేకరించిన వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీకి రూ.335కోట్ల మొత్తాల విరాళాల కోసం 2018-19 నుండి 2022-23 వరకు 30 కంపెనీలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖల చర్యలు, దాడులు ఎదుర్కొన్న వివరాలను న్యూస్‌ లాండ్రీ, న్యూస్‌ మినిట్‌ వంటి వార్తా పోర్టళ్ళు విడుదల చేశాయి.
వీటిలో, 23 కంపెనీలు 2014 నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు ఎదురయ్యేంతవరకు బీజేపీకి ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వలేదు. కేంద్ర సంస్థలు కంపెనీలకు వెళ్ళిన నాలుగు మాసాల వ్యవధిలోనే నాలుగు కంపెనీలు రూ.9.05 కోట్లకు పైగా మొత్తాన్ని బీజేపీకి అందచేశాయి. గతంలో పార్టీకి విరాళమిచ్చిన ఆరు కంపెనీలు ఈ దాడులు మొదలైన తర్వాత మరింత పెద్ద మొత్తాలను అందచేశాయి. గతంలో బీజేపీకి విరాళాలు ఇచ్చినా కూడా ఒక ఏడాది పాటు ఇవ్వని ఆరు కంపెనీలపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకున్నాయి. విరాళాలు ఇచ్చిన 30 కంపెనీల్లో మూడు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు ఇచ్చిందనే ఫిర్యాదులు కూడా వున్నాయి. ఐదేండ్లపాటు కంపెనీల ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్‌లను, ఎన్నికల కమిషన్‌ పత్రాలను పరిశీలించిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులతో వసూలు చేసిన విరాళాల వివరాలతో న్యూస్‌ మినిట్‌, న్యూస్‌లాండ్రీల బృందం ఒక నివేదికను రూపొందించింది. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని కంపెనీలు బీజేపీకి విరాళమిచ్చాయి. కోటి రూపాయిలకు పైగా విరాళమిచ్చిన పక్షాల సమాచారాన్ని మీడియా బృందం చెక్‌ చేసింది.
దాడుల సందర్భంగా కొన్ని సంస్థలు విరాళమిస్తే, ఇతర కంపెనీలపై దాడులు చేస్తుండగానే విరాళం అందచేసిన కంపెనీలు కొన్ని వున్నాయి. విరాళాలు అందిన తర్వాత కొన్ని కంపెనీలపై చర్యలు విరమించుకోవడం కూడా జరిగింది. మరికొన్ని కంపెనీలపై ఇంకా చర్యలు కొనసాగుతునే వున్నాయి. 2022-23లో ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి రూ.1300కోట్లు వసూలు చేసింది .2018 -2022 మధ్యలో బీజేపీ అందుకున్న మొత్తం విరాళాల్లో 57శాతం ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయి. గత పదేండ్లలో ఎన్నికల ట్రస్టుల ద్వారా కూడా పెద్ద మొత్తాలనే సేకరించింది. వివిధ ట్రస్టుల ద్వారా రూ.1893 కోట్లను బిజెపి వసూలు చేసింది. కొద్ది రోజుల క్రితమే రాజ్యాంగ విరుద్ధమంటూ ఎన్నికల బాండ్లను సుప్రీం కోర్టు రద్దు చేసింది.
న్యూస్‌ పోర్టళ్ళ నివేదిక నేపథ్యంలో సిపిఎం నేత సీతారాం ఏచూరి దీనిపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ఇడి, సిబిలను ఉపయోగించడమే కాకుండా బ్లాక్‌మెయిలింగ్‌ కళలో కూడా మోడీ ప్రభుత్వం సిద్ధహస్తురాలని తాజా వివరాలతో రుజువైందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.