– విద్యార్థుల్లేరనే నెపంతో మూసేసిన పాఠశాలలు తిరిగి తెరవాలి
– మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు
– బదిలీలు, పదోన్నతుల అవాంతరాలపై దృష్టిసారించాలి
– ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి
– ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో స్కిల్ యూనివర్సిటీ
– విద్యా, పరిశ్రమలు, కార్మిక కార్యదర్శులతో కమిటీ :విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని పంచాయతీలన్నింటిలో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని ఊరు రాష్ట్రంలో ఉండొద్దని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సీఎంవో అధికారులు శేషాద్రి, షా-నవాజ్ కాసీం తదితర అధికారులు పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడుగానీ, బాలికగానీ చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థుల్లేరనే నెపంతో మూసేసిన అన్ని పాఠశాలలనూ తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా మెగా డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని గురించి అధికారులను సీఎం ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలనూ ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో ఉన్న అవాంతరాలపై దృష్టిసారించాలని సూచించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలనీ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. విద్యాలయాల విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి పరిశీలించాలని ఆదేశించారు.
కొడంగల్ సహా 9 జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలు
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా యూనివర్సిటీలుండాలని అన్నారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు మిగతా ఉమ్మడి తొమ్మిది జిలాల్లో కూడా స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకుగాను విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ను ఆదేశించారు.