‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్ర సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సీక్వెల్తో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్రం బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె లుక్స్తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్, సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ను అద్భుతంగా రూపొందించారు. రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది.