– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం లోక్సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలకు బలం చేకూరుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల్లో వస్తుందనే వార్తల నేపథ్యంలో గోయల్ అనూహ్య రాజీనామా విస్మయం కలిగించిందన్నారు. రాజీనామా వెనుక కారణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముగ్గురు సభ్యులు ఉండే కేంద్ర ఎన్నికల కమిషన్లో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉండడం, ఆ ఖాళీలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లోనే జరగనుం డడం ఆందోళన కలిగిస్తోం దన్నారు.
గతంలో కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారని కానీ ఇప్పుడు నూతన చట్ట సవరణ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బదులుగా ఒక కేంద్రమంత్రి ఉంటారని తెలిపారు. కాబట్టి ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో నిష్పాక్షికత సందేహమేనని తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రోరల్ బాండ్ల వ్యవహారం అధికార పార్టీకి అనుకూలంగా ఉందనేది తేలిపోయిందన్నారు. ఆ బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుని చ్చినప్పటికీ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థల పేర్లు బయట పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నదన్నారు. అలాగే ఈవీఎంల వ్యవహారంలో ఎప్పటినుండో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని గుర్తు చేశారు.