– వేసవిలో ఎద్దడి తలెత్తకుండా చూడాలి
– సాగర్ నుంచి ఏపీ సాగునీటిని తరలించొద్దు
– అవసరం మేరకు నీటి విడుదలకు కేఆర్ఎంబీకి లేఖ
– ఎంఏయూడీ, పీఆర్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలి : సీఎం రేవంత్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగునీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు సీఎంకు గణాంకాలు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందిస్తూ నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలు, గూడేలు, ఎస్సీ కాలనీలు అనే తేడా లేకుండా ప్రతినివాస ప్రాంతానికి తాగునీరు అందేలా సాగునీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది టీఎంసీలకుపైగా నీరు తీసుకుపోతున్నదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతపెద్ద మొత్తంలో తాగునీరు ఎక్కడ వినియోగిస్తున్నారనీ, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ఏప్రిల్ నెలాఖరు, మే నెల్లో వచ్చిన వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది రాలేదనీ, లేకుంటే నారాయణపూర్ జలాశయం నీరు విడుదల కోరుతూ కర్నాటకను అభ్యర్థించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేండ్ల క్రితం తీసుకున్నామని తెలిపారు. అయితే దానిని చివరి అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఆదేశించారు. నూతన పథకాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్న అనేక నీటి వనరులను వదిలేశారనీ, ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా కాగ్నా నదిని సీఎం ప్రస్తావించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీరు వినియోగించుకునే అవకాశం ఉందనీ, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దానిని వదిలేశారన్నారు. ఈ తరహా నీటివనరులు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఉంటాయని వాటిని వినియోగించుకోవాలన్నారు. అలాగే అవసరమైన చోట తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలన్నారు. వీటికోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ.కోటి, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదనీ, మిషన్ భగీరథ ద్వారా 99 శాతం ఇండ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే జల్ జీవన్మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వోద్దనీ, క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదికలు కేంద్రానికి పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటివనరులు, అవసరమైన తాగునీటి పరిమాణం, సమస్యలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయని అన్నారు. గత రెండేండ్లుగా జీతాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. వేతన బకాయిలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి సిబ్బందికి జీతాలు అందేలా ఆర్థిక శాఖ నుంచి నిధు లు విడుదల చేయాలని ఆదేశించారు. తాము నిధులు విడుదల చేస్తామని వాటిని బడాబాబులకు ఇవ్వకుండా క్షేత్ర స్థాయి సిబ్బందికి అందేలా చూడాల ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనూ….
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలకసంస్థ పరిధిలోనూ తాగునీటికి ఎటువంటి సమస్యా లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెద్దగా ఇబ్బందులు లేవనీ, ఏదైనా కొరత ఏర్పడితే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ నుంచి కొంతమేర తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నగరంలోని నీటి అవసరాలపై సూక్ష్మస్థాయి (మైక్రోలెవల్)లో సమీక్షించి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేసవి పూర్తయ్యే వరకు తాగు నీటి ట్యాంకర్ల రాకపోకల విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.