కేంద్రం తీరు వల్లే రాబడికి గండి..

– జీఎస్టీ పరిహారం రూ.4 వేల కోట్లు రావాలె…
– సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు
– నిర్దేశిత లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలంటూ రేవంత్‌ ఆదేశాలు
– నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రవాణాను అరికట్టాలి
– వాణిజ్య పన్నులు,రిజిస్ట్రేషన్‌ శాఖకు సొంత భవనాలుండాలి
– సమగ్రమైన ఇసుక విధానాన్ని రూపొందించాలంటూ సూచన
– గనుల శాఖ విధించిన జరిమానాలను వసూలు చేయాలి
– ఏండ్లుగా తిష్టవేసిన అధికారులను బదిలీ చేయాలంటూ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లకుపైగా తెలంగాణకు చెల్లించేదని ఉన్నతాధికారులు… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. దాని గడువు ముగిసినా, వాటిని మోడీ సర్కార్‌ చెల్లించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వ రాబడిలో వ్యత్యాసం కనిపిస్తోందని వారు ఆయనకు విన్నవించారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్ను లక్ష్యానికి, రాబడికి మధ్య వ్యత్యాసం ఎందుకు ఎక్కువగా ఉంటోందంటూ సీఎం ప్రశ్నించిన సందర్భంగా అధికారులు ఈ మేరకు వివరణిచ్చారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖల పన్ను వసూళ్లపై సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు అన్ని శాఖలూ పన్నులు వసూలు చేయలంటూ ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని సూచించారు. మద్యం సరఫరా, విక్రయాలకు సంబంధించిన లెక్కల్లో తేడాలు ఉంటున్నాయని తెలిపారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రతీ డిస్టలరీ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్‌ అమర్చి వాటిని ట్రాకింగ్‌ చేయాలనీ, బాటిల్‌ ట్రాకింగ్‌ సిస్టం కూడా ఉండాలని తెలిపారు. ఆయా వాహనాల వే-బిల్లులు కచ్చితంగా ఉండాలంటూ సూచించారు. నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌తోపాటు గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయనే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. తమ శాఖలోనూ అదే పరిస్థితి నెలకొందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ టి.కె.శ్రీదేవి తెలిపారు. ఈ అంశాలపై స్పందించిన సీఎం… ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల్లోని పలు ప్రాంతాల్లో రహదారులపై కంకరను కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారనీ, వివిధ ప్రదేశాల్లోని ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలను అందుకు వినియోగించాలని పేర్కొన్నారు. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు. వే-బిల్లులతోపాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్‌ ఉండాలని అన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవటం ద్వారా అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ పలు గనులపై గతంలో జరిమానాలు విధించారనీ, కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఆయా జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని తగ్గించారనీ, అందుకుగల కారణాలను తెలుపుతూ ఒక నివేదిక సమర్పించాలని కోరారు. టీఎస్‌ఎమ్‌డీసీతోపాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏండ్ల తరబడి తిష్ట వేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో కొందరిపై ఆరోపణలున్నాయని గుర్తు చేశారు. అలాంటి వారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.