
– పోలింగ్ రోజు 144 సెక్షన్ విధించాలి
– కేంద్ర ఎన్నికల స్పెషల్ పోలీస్ అబ్జర్వర్లు విజయ్ సింగ్ మీనా, వినీత్ కన్నా
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్: శాసన సభ సాధారణ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనేల తమ విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి కేంద్ర ఎన్నికల స్పెషల్ పోలీసు అబ్జర్వర్ లు విజయ్ సింగ్ మీనా, వినీత్ ఖన్నా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల పోలీసు అబ్జర్వర్ లు విజయ్ సింగ్ మీనా, వినీత్ ఖన్నా, జిల్లా ఎస్పి.అపూర్వ రావు తో కలిసి కేంద్ర పార మిలటరీ బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ ల వద్ద శాంతి భద్రతలు భంగం కలగకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, పోలింగ్ బూత్ కు 100 మీటర్ల వెలుపలనే వాహనాలను ఆపే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ రోజున ఎక్కువ మంది ఒకే చోట గుమి కూడకుండా 144 సెక్షన్ విధించాలని అన్నారు. అదనపు బలగాలను రిజర్వులో ఉంచుకోవాలని, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అత్యవసర సమయంలో వినియోగించుకోనెలా సిబ్బంది ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా యస్.పి అపూర్వరావు మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుటకు తీసుకున్న బందోబస్తు చర్యలను, చెక్ పోస్టుల పనితీరును, జిల్లా లో ఉన్న వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసిన రూట్ మొబైల్స్ వివరాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకుంటున్న చర్యలను, కమ్యూనికేషన్ వివరాలు, కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు, పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్,ఇవిఎం యంత్రాల సెక్యూరిటీ తదితర ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు.