ప్రజా పాలన విజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు..

– సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్..
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ అదనపు  కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్  ఆధర్యంలో  సంబంధిత అధికారులతో సమన్వయ   సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం రోజు రెవిన్యూ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7 వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని  ప్రభుత్వం జూనియర్ కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 6.00 గంటలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే అట్టహాసంగా ప్రజా కళా యాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే  ప్రజా పాలన కళా యాత్ర చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగిందని, దీనికి సంబంధించి సన్నాహక  ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన కళాయాత్ర ప్రతినిధులు సంగీత, నాటక అకాడమీ ప్రోఫెసర్ అలేఖ్య పుంజల,  బృందం అన్ని జిల్లా పర్యటించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో  ఈ  నెల 7 న ప్రోఫెసర్ అలేఖ్య పుంజల బృందం ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పరస్పర సమన్వయంతో పని చేయాలని అధికారుల కు సూచించారు. వేదికను అందంగా, ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేయాలని, విద్యార్థులు, మహిళలు, యువతను సమీకరించాలని, కళా ప్రదర్శనలకు ఇబ్బంది తలెత్తకుండా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, కళాకారులకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని అన్నారు.వేదిక వద్ద అవసరమైన పక్షంలో అత్యవసర సేవల కోసం వైద్య బృందం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి,  భువనగిరి య పి డి ఓ, శ్రీనివాస్ ,జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ,  డి పి ఆర్ ఓ అరుంధతి, వైద్యా ఆరోగ్య అధికారి మనోహర్,ఎస్సీ, బీసీ,  రెసిడెన్షియల్ జిల్లా అధికారులు, జయపాల్ రెడ్డి, యాదయ్య లు పాల్గొన్నారు.