ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు

Prashant Kishore to the party Identification of Election Commission– నితీశ్‌ పాలన వదిలి జన్‌ సురాజ్‌ వెనుక బీజేపీ..?
పాట్నా : ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రెండేండ్ల కిందట ప్రారంభించిన ‘జన్‌ సురాజ్‌ పార్టీ’కి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యాక్రమంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో తన రాజకీయ పార్టీని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ‘ఈ పార్టీ రెండేండ్లుగా క్రియాశీలంగా ఉంది. ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది’ అని ఆయన అన్నారు. అయితే తమ పార్టీకి నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదని, రెండేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారే నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మూడు దశాబ్దాలుగా బీహార్‌ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇప్పుడు ఆ సంప్రదాయానికి తెరపడాలని ఆయన కోరారు. అయితే బీజేపీకి నమ్మినబంటుగా ఆ పార్టీ కనుసన్నల్లోనే ఆయన పని చేస్తున్నారని, బీహార్‌లో నితీశ్‌ పాలన అప్రతిష్టపాలైన నేపథ్యంలో కొత్త ఎత్తుగడగానే ప్రశాంత్‌ కిశోర్‌ను బీజేపీకి తెరపైకి తీసుకొస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాను బీజేపీతో కలిసి పని చేస్తున్నట్టు వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. విద్య, వైద్య రంగాల్లో అత్యున్నత ప్రమాణాల కోసం, ప్రజల జీవనోపాధులు మెరుగుపడాలనే సంకల్పంతోనే తాను రాజకీయ పార్టీని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.