ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. విధులు సక్రమంగా నిర్వహించండి

– సమయపాలన పాటించని అధికారులకు షోకాజు నోటీసులు కలెక్టర్‌ కర్ణన్‌
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నందున సెక్టార్‌ అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ. కర్ణన్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్యాభవన్‌లో ఆర్వోలు, ఏఆర్వోలు, సెక్టార్‌ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాగానే అప్రమత్తమైన అధికారులు మున్సిపాలిటిలలో, గ్రామపంచాయతీలలో ఎలాంటి సఘటనలు, ఫిర్యాదులు రాకుండా విగ్రహాలకు ముసుగులు, వాల్‌ రైటింగ్స్‌ చేడిపేయడం, ఫ్లెక్సీ లు తొలగించడం, మొదలగు పనులలో బాగా పనిచేసిన మున్సిపల్‌ కమిషనర్లను, ఎంపీడీవోలను, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇలాగే ఎన్నికలు ముగిసే వరకు తమ విధులలో సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే సి విజిల్‌ మన జిల్లాలోనే మొదటగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. సెక్టర్‌ ఆఫీసర్లు రూట్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాలలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా, వర్షాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అందుకు అనుగుణంగా వెంటనే ప్రత్యామనాయ రోడ్లపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. అందులో భాగంగా పోలింగ్‌ స్టేషన్‌ నెంబరు, అసెంబ్లీ కాన్స్టెన్సీ నెంబర్‌, ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, సెక్టర్‌ ఆఫీసర్‌, పోలీస్‌ ఆఫీసర్లతో పాటు బిఎల్‌ఓ నెంబర్‌, కంట్రోల్‌ నెంబర్‌ కూడా వీధిగా ప్రదర్శించాలన్నారు. దీనికి సంబంధించిన ప్రోఫాల్మాలను ఆర్వోలు రూపొందించాలన్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీలలో మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలలో తాహాసిల్దార్‌ లు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫామ్‌ 12(డీ) సర్వే ప్రక్రియ, 80 సంవత్సరాలు పైబడిన, పీడబ్ల్యుడి ఓటర్ల ద్వారా సేకరించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా అర్హులు ఎంతమంది ఉన్నారో కూడా ఆయన అధికారులను ప్రశ్నించారు. పార్ట్‌ 1 ప్రకారము ఆబ్సెంట్‌ ఓటర్లు, పార్ట్‌ 2 ప్రకారము ఎసెన్షియల్‌ సర్వీస్‌ సిబ్బందికి ఉపయోగించాలన్నారు. దీనికోసం సంబంధించిన నోడల్‌ ఆఫీసర్‌ చేత ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు. ఈవీఎంల రాండమైజేషన్‌ చేసి నియోజకవర్గ కేంద్రాలలో గుర్తించిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు పంపిస్తామన్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఈవీఎంలను కేటగిరీల వారిగా ఏ, బీ, సీ, డీిలుగా వర్గీకరిస్తాం అన్నారు. మొత్తం ఈవీఎంలపై ఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. సమయానికి హాజరు కాని సెక్టార్‌ ఆఫీసర్లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్వోలు జే. శ్రీనివాస్‌, హేమంత కేశవ పాటిల్‌, రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్‌, ఎంసీసీ నోడల్‌ ఆఫీసర్‌ హరి సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.
మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ
అంతకు ముందు సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా మాస్టర్‌ ట్రైనర్లకు అదనపు కలెక్టర్‌ జే. శ్రీనివాస్‌ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 8 మంది చొప్పున మాస్టర్‌ ట్రైనర్లను నియమించినట్లు తెలిపారు. వారంతా ఆ నియోజకవర్గం ఆర్వోలను కలిసి పోలింగ్‌ ఆఫీసర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజు వారీగా రెండు సెషన్సు ప్రకారం శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ రాజకుమార్‌, ఎలక్షన్‌ సెల్‌ డిప్యూటీ తహసీల్దారు విజరు, తదితరులు పాల్గొన్నారు.