సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుద్ఘాతం

– బాలుడు మృతి
నవతెలంగాణ – చెన్నారావుపేట
సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంపంగి రమేష్‌ – లలిత దంపతుల కుమారుడు రాజేష్‌ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంట్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి పడిపోయాడు. వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లోపంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి తండ్రి రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ రెడ్డి తెలిపారు.