ముగిసిన పాశ్చాత్య దేశాల ఆధిపత్యం !

The dominance of Western countries is over!–  హంగేరియన్‌ ప్రధాని
పాశ్చాత్య ఆధిపత్య యుగం ముగిసిందని, కొత్త ప్రపంచ క్రమం ఆవిర్భవిస్తున్నదని హంగేరియన్‌ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ అన్నారు. అయితే పెద్ద కూటములలో చేరిపోవాలని ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ హంగరీ తనదైన స్వతంత్ర మార్గాన్నికొనసాగిస్తుందని ఆయన చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంపై పాశ్చాత్య విధానాన్ని హంగేరియన్‌ ప్రధాన మంత్రి తీవ్రంగా విమర్శిస్తాడు. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని, ఉక్రెయిన్‌ కు ఆయుధాల పంపిణీ ప్రమాదకరమైనదని, దానితో ఘర్షణ మరింతగా పెరుగుతుందని విక్టర్‌ ఓర్బన్‌ అన్నాడు. బుడాపెస్ట్‌ మరింత రక్తపాతాన్ని నివారించడానికి, యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలను ఆహ్వానించింది. అయితే ఉక్రెయిన్‌ అందుకు నిరాకరించిందని ఆయన చెప్పాడు. పాశ్చాత్య ఆధిపత్యం ముగిసిందనే విషయాన్ని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నదేనని మంగళవారంనాడు జరిగిన రాయబారుల వార్షిక సమావేశంలో ఓర్బన్‌ అన్నట్టు ఎమ్‌టిఐ వార్తా సంస్థ తెలిపింది. రూపుదిద్దుకుంటున్న కొత్త ప్రపంచ క్రమాన్ని, అభివృద్ధి చెందుతున్న పోకడలను నిరంతరం గమనిస్తూ, విశ్లేషించాలని ఆయన హంగేరియన్‌ దౌత్యవేత్తలను ఆయన కోరాడు. యూరోపియన్‌ యూనియన్‌, నాటో కూటమిలో తన దేశం సభ్యదేశంగా ఉన్నప్పటికీ హంగరీ సార్వభౌమ స్వతంత్ర విధానాలను కొనసాగిస్తుందని ఓర్బన్‌ చెప్పారు. బలమైన భౌగోళిక రాజకీయ కూటములతో హంగేరీ వంటి దేశాలకు స్వతంత్రంగా వ్యవహరించటం కష్టమౌతుందని ఆయన వివరించాడు.ఉక్రెయిన్‌ సంఘర్షణను ”ప్రాక్సీ వార్‌(వెనుక నుంచి మూడవ శక్తి నడిపించే యుద్ధం)”గా ఓర్బన్‌ అభివర్ణించాడు.