సమాజాన్ని జాగృతం చేసే కథలు, చక్కటి కుటుంబ ఇతివృత్తంతో యాభైకి పైగా సినిమాలను తీసిన ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి తీస్తున్న చిత్రమిది. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణా స్టూడియోలో ఆగష్టు 9న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుందని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య వెల్లడించగా, దర్శకుడిగా ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుత చిత్రాలను అందించిన నాన్న సమర్పణలో ఈ చిత్రం ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తుండటం ఆనందంగా ఉందని ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తెలిపారు. ఇతర విషయాలను చిత్రం ప్రారంభం రోజున వివరిస్తామన్నారు. దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ‘ఓ వైవిధ్య భరిత, ఫామిలీ ఎంటర్టైనర్గా ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రంగా దీనిని మలచనున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య.