గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లో గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు- కేటీఆర్‌ రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్‌, ఇతర పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. వారు సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి ఈ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌), ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షలకుపైగా యువకులు ఈ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న వారి సంక్షేమాన్ని చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈ దిశగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి రాగానే ఈ గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు గిగ్‌ వర్కర్ల ప్రతినిధులతో కలిపి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బోర్డులో ఒక లీగల్‌ సెల్‌ వ్యవస్థతోపాటు, ఈ యువకులకు కంపెనీల తరఫున ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చేస్తున్న డెలివరీకి కొంత సొమ్ము అందుకుంటున్న పద్ధతితోపాటు వారికి కనీస జీతాలను అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ ఉద్యోగాలు, ఇతర రంగాల్లో జరిగిన కంపెనీల విస్తరణ తర్వాత గిగ్‌ వర్కర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడిందని వివరించారు. దీంతో ఎవరిపైనా ఆధారకుండా వారు సంపాదించుకోగలుగుతున్నారనీ, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ చర్చల సందర్భంగా వారికి ఎదురవుతున్న పలు ఇబ్బందులను కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. పలు కంపెనీలు తమకు అందించే ఫీజులను ఏమాత్రం పెంచడం లేదనీ, పైగా ఇన్సెంటివ్‌లను తీసేశాయని వివరించారు. ఈ కంపెనీ ప్రతినిధులతో తాను స్వయంగా మాట్లాడి ఈ అంశంలో వారికి సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వమే స్వయంగా ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ బుకింగ్‌, ఇతర ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించిన ఒక ప్రత్యేక యాప్‌ని ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు తెలిపిన ప్రతిపాదనపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఇలాంటి ఒక వ్యవస్థ కేరళలో ప్రారంభమైందనీ, దానిపైన ఆధ్యయనం చేసి మరింత మెరుగులు దిద్ది తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.