ప్రభుత్వ జీతం పొందే  ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయాలి: కలెక్టర్

– ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
– డాక్టర్లు, సిబ్బంది ప్రజల కోసం పనిచేయాలి
– వారంలో  మార్పు కనిపించాలి
– సరైన సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం
– పనిచేయని వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ప్రభుత్వ జీతం పొందుతూ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి  వైద్యులు,అధికారులు, హెచ్ఓడీలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశమయ్యారు. తాను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత   ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రి ద్వారా  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లో అనేక మార్పులు రావాల్సి ఉందని అన్నారు.  వారం రోజుల్లో ఆసుపత్రిలోని  ఆయా డిపార్ట్మెంట్ల వారిగా సమీక్ష నిర్వహిస్తాను. ఇందుకు హెచ్ ఓ డి లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.  అధికారులు, సిబ్బంది, డాక్టర్లు సమయపాలన పాటించాలి.  శానిటేషన్ ను మెరుగుపరచాలని సూచించారు.  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిరోజు రెండు గంటలు, తాను ప్రతివారం జిల్లా ఆస్పత్రి పై సమీక్షిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక జిల్లా అధికారి జిల్లా ఆస్పత్రికి వచ్చే ఏర్పాటు చేసి అందరి హాజరును పర్యవేక్షిస్తాం అన్నారు. తక్షణ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు ఎక్కడైనా కొరత ఉన్నట్లయితే వెంటనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని,కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు. రోగులు, వారి సహాయకుల నుండి ఎవరైనా డబ్బులు అడిగితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్యూటీ డాక్టర్లు డ్యూటీ టైం లో ఆసుపత్రిలోనే ఉండాలి.హెచ్ ఓ డి ల నియంత్రణలోనే అందరూ పని చేయాలని అన్నారు.జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాలు, హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసే కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిరోజు నిరంతర పరిరక్షణ ఉంటుందని తెలిపారు.అత్యవసర మందులను ఏర్పాటు చేస్తాం. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని,వారంలో అన్ని వార్డులలో మరమ్మతులు పూర్తి కావాలని ఆదేశించారు.  మున్సిపల్ ద్వారా ప్రతిరోజు ఆసుపత్రిలో చెత్తను తీసివేసే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు తాగునీరు ఆసుపత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ ద్వారా సక్రమంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని,  శానిటేషన్, భోజనం కాంట్రాక్టర్లు తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వచ్చే బుధవారం సమీక్ష నాటికి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మార్పు కనిపించాలని,ప్రతి ఒక్కరు టీం వర్క్ చేయాలని సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  టి.పూర్ణచంద్ర మాట్లాడారు.ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి  సూపరింట్టిండెంట్ నిత్యానంద్, డిసిహెచ్ఎస్ మాతృ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి, టిఎస్ ఎంఐడిసి, విద్యుత్తు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆయా హెచ్ఓడి లు, స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.