– జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
– నేర సమీక్ష సమావేశంలో అధికారులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – సిరిసిల్ల
జూలై 1నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్న నూతన చట్టాలైన భారతీయ న్యాయ సంహిత ,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగతులు నిర్వహించామని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన ఉండాలని,నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో నమ్మకం,భద్రత పై విశ్వాసం కలిగించేందుకు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, వాటి పురోగతి, పెండింగ్లో ఉండటానికి గల కారణాలు అడిగి తెలుసుకుని,పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్), ప్రమాదాలకు గల కారణాలను గుర్తించాలి. వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై ,మూల మలుపుల వద్ద, అప్రోచ్ రోడ్ల వద్ద భారీ కేడ్స్, రబ్బర్ స్టిప్స్, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం ఉంటుందని అన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు అయిన గంజాయి, గుడుంబా, పేకాట, పిడిఎస్ రైస్, అక్రమ ఇసుక రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించి వాటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కట్టడి చేయాలన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.. మీకోసం ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ అధికారులు , సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రోడ్ ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు, షీ టీమ్ పై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ అమలు పరుస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్ధవంతంగా అమలు చేస్తూ ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని అన్నారు.గత నెలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 22 మంది పోలీస్ అధికారులకు, సిబ్బంది కి ప్రశంశ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రేడ్డి,సర్వర్,సి.ఐ లు,ఆర్.ఐ లు ,ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.