మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి 

– నాటిన ప్రతి మొక్క సంరక్షించాలి
– మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం అయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, వర్షాలు అధికంగా కురిసేందుకు మొక్కలు దోహదం చేస్తాయని, అడవులు ఎక్కువగా ఉన్నచోటనే వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు, ఇటీవల కరోనా ఉదంతం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు. మొక్కలు నాటే బాధ్యత ఒక్క ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటాలనికోరారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని చెప్పారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 66 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్క సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని, మొక్కలు నాటే కార్యక్రమం మన భవిష్యత్తుకు సంబంధించిందని, ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని స్థలాలలో అలాగే రహదారులకు ఇరువైపులా అన్నిచోట్ల మొక్కలు నాటాలని కోరారు.  అంతకుముందు మంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడారు. పదవ తరగతిలో గత సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారని ? అడిగి తెలుసుకున్నారు. 16 మందికి 14 మంది ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలపగా పదవ తరగతిలో ఏ ఒక్కరు ఫెయిల్ కాకూడదని, తప్పనిసరిగా 9.5 పైనే  గ్రేడ్ రావాలని, ఇందుకు గాను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అదనంగా  క్లాసులు తీసుకోవాలని చెప్పారు.
మీరేం కావాలనుకుంటున్నారు..?
పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. తనతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి జిల్లా కలెక్టర్ గా, మంత్రిగా అయ్యామని విద్యార్థులు చదువు పైన దృష్టి సారించాలని, ఇప్పటినుండే జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని తెలిపారు. పాఠశాలకు అవసరమైన డ్యూయల్ డెస్క్ ను మూడు నాలుగు రోజుల్లో పంపించడం జరుగుతుందని, అదేవిధంగా పాఠశాలకు తాగునీటి కోసం వాటర్ ట్యాంకు కోరగా తక్షణమే మంజూరు చేశారు. నాలుగు టాయిలెట్లను,ముగ్గురు స్కావెంజర్లను తక్షణమే ఏర్పాటు చేస్తానని,  మంత్రిహామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి డిజిటల్ బోర్డుపై తరగతులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, ఇతర వివరాలను తక్షణమే సమర్పించాలని డీఈఓ ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వనమహోత్సవం జిల్లా లక్ష్యాలను మీడియాకు వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య, ఆర్డీవో రవి, డిఎస్పి శివరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ పల్లి ఎల్లయ్య, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.