– ఆయనది చిల్లర ప్రచారం
– యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులను ఎన్జీటీ రద్దు చేసింది
– కానీ కేసీఆర్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు
– తెలంగాణ ప్రజలపై మోయలేని భారం : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చెప్పేవన్నీ కట్టు కథలేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విమర్శించారు. తెలంగాణ ప్రజలపై ఆయన మోయలేని భారం వేశారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే ఆయన తట్టుకోలేపోతున్నా రని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. పదేండ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? అని ప్రశ్నించారు. సోమవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలు అంటూ అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. జనరేటర్ పవర్తో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మధ్యలో కరెంట్ పోయిందని చిల్లర ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారని, దూరంగా ఉండటం వల్ల థర్మల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోందని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులను ఎన్జీటీ రద్దు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజలను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు వేల మెగావాట్ల పవర్ తెలంగాణకు ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందని చెప్పారు. 2,400 మెగావాట్ల పీపీఏ అగ్రిమెంట్లు చేసుకోకుండా కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆయన పాపం వల్లే ఎన్టీపీసీ రాష్ట్రానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు లాభం కోసం కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీపీసీ వల్ల కరెంట్ యూనిట్కు రూ.9 ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ సంస్థకు రూ. 1.10 లక్ష కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటనకు వస్తున్నామని చెప్పారు. గతంలో పెండింగ్లో ఉన్న అంశాలను పూర్తి చేశామని గుర్తుచేశారు. కేసీఆర్లాగా ప్రధానమంత్రి కావడానికి పది రోజులు ఇక్కడే ఉండి కుట్రలు చేయలేదన్నారు. తాము ఇతరులతో చర్చలు జరపలేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం కాల్వల్లోకి కేసీఆర్ నీరు వదిలారన్నారు. ఇప్పటికే తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని, కరెంట్ను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
ప్రతినెలా ఒకటో తేదీన జీతాలిస్తున్నాం
2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే మొదటి నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందని, తాము వచ్చిన తర్వాత ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చామని చెప్పారు. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను పెడితే అవి కూడా ఇచ్చుకుంటూ వచ్చామన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలను ఇచ్చామని చెప్పారు. ఐదేండ్లలో మహిళలకు వడ్డీలేని లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ వచ్చాకే వర్షాలు రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, జూన్లో ప్రభుత్వం బీఆర్ఎస్ది కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దగ్గరి నుంచే వర్షాలు రావట్లేదన్నారు. ”ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. దేశమంతా గ్రిడ్ అనుసంధానం 2013లోనే యూపీఏ ప్రభుత్వం చేసింది. పదేండ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలి. అందరికీ రెండు పడకగదుల ఇండ్లు నిర్మించి ఇచ్చారా? ప్రతి మండలంలో బాలబాలికలకు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా? రైతులకు రుణమాఫీ ఐదేండ్లలో పూర్తి చేశారా? వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసిందెవరు? ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది. అన్ని లెక్కలతో చర్చకు రావడానికి నేను సిద్ధం” అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రిజర్వాయర్లో ఎక్కడ నీళ్లు లేకున్నా అది కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో నీళ్లు లేకుండా కేసీఆర్ చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలే
1:40 am