గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు కావడం నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. కుటుంబాలకు దూరమై… కంటి నిండా నిద్రపోక, కడుపునిండా తినక… కష్టాలను, కన్నీళ్లను భరిస్తూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆశలకు టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం, రాష్ట్ర సర్కారు అలసత్వం గండికొడుతున్నాయి.
నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పాలకులు వారిని మోసం చేస్తున్నారు. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఉద్యోగ నియామకాలను చేపట్టే బాధ్యతగల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పారదర్శకత కొరవడింది. రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్న సంస్థలోనూ జరుగుతున్న అవినీతి, అక్రమాలు, లోటుపాట్లు చూస్తుంటే నమ్మకమన్న పదానికి అర్థం లేకుండా పోతోంది. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్న తపన, తాపత్రయంతో పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు సమాధానం కనిపించడం లేదు. ప్రస్తుతం కోర్టు పరీక్షలు రద్దుచేసిన తాజా వ్యవహారంలోనే కాదు… మొన్నటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలోనే కాదు… గతంలోకి తొంగి చూస్తే అనేక సందర్భాల్లో వైఫల్యాలకు కేంద్ర బిందువుగా టీఎస్పీఎస్సీ నిందలు ఎదుర్కొంది. శాఖాపరమైన నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉంటుందన్న క్రమంలోనే కమిషన్ ద్వారా జరిగే నియామకాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ, అంతర్గతంగా జరుగుతున్న లోపాలు ఒక్కొక్కటీ బయటపడ్డకొద్దీ ఈ సంస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
గతంలో స్వల్ప తేడాతో ఉద్యోగం రాక భవిష్యత్తు కోల్పోయిన లక్షలాది మంది అభ్యర్థుల గుండె తరుక్కుపోతోంది. ఉద్యోగ నియామకాల్లో ఎంతపెద్ద సిఫారసులకైనా ఆస్కారం లేకుండా వందశాతం పారదర్శకత ఉండాలన్న లక్ష్యంతో, రాజ్యాంగబద్దమైన నిబంధనలతో ఏర్పాటైన ఈ సంస్థ క్రమేపీ నియంత్రిత పాలనలోకి వెళ్ళిపోతోంది. టీఎస్పీఎస్సీ పరిపాలనలో అత్యున్నస్థాయి పదవుల్లో నియామకమవుతున్న వ్యక్తులు కూడా అందుకు ఒక కారణంగా విద్యారంగ నిపుణులు, మేధావులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెనక పరిపాలన, విధానపరమైన వైఫల్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఉన్నతస్థాయి పర్యవేక్షణ జరుగుతుందని, అనంతరం కమిషన్ పాలన షరా మామూలేనన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ సంస్థ అంతర్గత వ్యవహారాలను పరిశీలిస్తే చైర్మన్ మొదలుకుని సభ్యుల వరకూ ఏ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. రాజ్యాంగాధిపతి హౌదాలో ఉన్న గవర్నర్కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతియేటా క్రమం తప్పకుండా వార్షిక నివేదికలను అందజేయాల్సి ఉంది. ఆ నివేదికలపై గవర్నర్ వార్షికంగా రెండు పర్యాయాలైనా సమీక్ష చేయవలసి ఉంటుంది. కానీ అవేవీ జరగడం లేదన్నదన్నది పచ్చి వాస్తవం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మార్గదర్శకాలను అనుసరిస్తూ సంస్థాగత పాలన, కొలువుల నియామకాలు అత్యంత గోప్యంగా, పారదర్శకంగా జరగాల్సిన టీఎస్సీఎస్సీలో అక్రమాలే ఎక్కువన్న వాదనకు తాజా ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే ఉన్నతస్థాయి ఉద్యోగాలు నియమించే కమిషన్ కార్యకలాపాల్లో అర్హతలేని వ్యక్తులు, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఏ మేరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో ఉద్యోగాలివ్వాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే అన్ని ఖాళీ పోస్టులుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పరిమిత సంఖ్యలో సిబ్బంది, బలహీనమైన సాంకేతిక వ్యవస్థ అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. సాంకేతికతలో లోపాలు, రక్షణ లేమిని ఆసరాగా చేసుకుని కమిషన్లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది లోపాయకారి ఒప్పందాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు- తాజా ఘటనకు సంబంధించిన దర్యాప్తులో వెల్లడైంది. అదనపు సిబ్బంది, పటిష్టమైన ఐటీ- కేంద్రంతో పాటు- ఇతర లోపాలపై ముందుగానే మేల్కొని ఉంటే ఈ పరిస్థితికి దారితీసేది కాదని విద్యారంగ, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు బృందానికి నివ్వెరపోయే నిజాలు దర్శనమిచ్చాయి. లక్షలాది మంది జీవితాలతో ముడిపెట్టుకుని ఉన్న నియామకాల ప్రక్రియలో టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అత్యంత బలహీనంగా ఉందని వెల్లడైంది. ఐటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు కేటాయింపులు తగ్గించారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలోని సాంకేతిక సేవల విభాగంలో ఆరుగురి స్థానంలో నలుగురే పనిచేయడం వైచిత్రి.