– 14 కిలోమీటర్లు నడుస్తూ పరిశీలించిన హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి
– అధికారులకు పలు ఆదేశాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తగా తలపెట్టిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మెట్రో స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి శనివారం నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 14 కిలోమీటర్లు కాలినడకన పరిశీలించారు. నాగోలు-ఎయిర్పోర్ట్ మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్.. ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్కు దగ్గరలోనే ఎడమ వైపున (ఎల్బీనగర్ వైపు) ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాన్కోర్స్ లెవల్లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు. నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్ల దృష్ట్యా, మెట్రో ఎలైన్మెంటును మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపాలన్నారు. అలాగే మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించాలని సూచించారు. ఇక కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీని ఇస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరి అవసరాల కోసం అదనపు స్టేషన్కు ప్లాన్ చేయాలని చెప్పారు. ప్రతిపాదిత నాగోల్ ఆర్టీఓ స్టేషన్ను అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో నిర్మించాలన్నారు. ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున ఉండబోయే కొత్త స్టేషన్.. కారిడార్-1లో (మియాపూర్-ఎల్బీనగర్) ప్రస్తుత ఎల్బీనగర్ స్టేషన్కు విశాలమైన స్కై వాక్తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు. బైరామల్గూడ/సాగర్ రోడ్ జంక్షన్లో ఇప్పటికే ఎత్తైన ఫ్లైఓవర్లు ఉండటంతో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తు ఇంకా పెంచాల్సి ఉంది. అయితే బైరామల్గూడ/సాగర్ రోడ్ జంక్షన్ మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి గాను, మెట్రో అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందని, పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు, కన్సల్టెంట్కు ఎండీ ఎన్వీఎస్రెడ్డి సూచించారు. మైత్రీనగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబా నగర్ తదితర ప్రాంతాలలో ప్రతిపాదిత స్టేషన్లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులుకు వీలుగా జంక్షన్లకు సమీపంలో నిర్మించాలని సూచించారు.చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్ నిర్మాణం ఉన్నందున ఇక్కడ ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మాణం, అలాగే, చంద్రాయణగుట్ట వరకూ చేపట్టిన పాత నగరం మెట్రో విస్తరణ పనులు, టెర్మినల్ స్టేషన్ నిర్మాణ పనులు ఒక ఇంజినీరింగ్ సవాలుగా మారే అవకాశం ఉందని ఎన్వీయస్ అన్నారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ ఫారంల ఎత్తును సరిచేయాలని ఎండీ ఆదేశించారు. ప్రయివేటు ఆస్తులను కనిష్టంగా సేకరించే విధంగా స్టేషన్లకు అనుగుణంగా జాగ్రత్తగా ప్రణాళికల ను రూపొందించాలని అధికారులకు సూచించారు. మెట్రో స్టేషన్ల స్థల ఎంపికకు సంబంధించి, అలాగే స్టేషన్ పేర్లను ఖరారు చేసేముందు స్థానికులను, ట్రాఫిక్ పోలీసులను, హెచ్ఏఎంఎల్ అధికారులు సంప్రదిం చాలని ఎండీ సూచించారు. ఈ పర్యటనలో మెట్రో ఉన్నతాధికారులతో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులు, హెచ్ఏఎంఎల్ సీఈఈ డీవీఎస్ రాజు, సీఎస్టీఈ ఎస్కే దాస్, సీపీఎం బి. ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ బీఎన్ రాజేశ్వర్, ఎస్ఈ వై. సయప రెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ఎంఎస్. సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.