– తాజాగా ఇండోనేషియా ఆస్పత్రిపై దాడి
– 12 మంది మృతి, నేలపై చెల్లాచెదురుగా మృతదేహాలు
– మరో స్కూలుపైనా దాడి
– అరబ్, ముస్లింలీగ్ మంత్రుల టూర్ జిన్పింగ్, మాక్రాన్ ఫోన్కాల్
– హుతీ రెబెల్స్ అదుపులో ఇజ్రాయిల్ నౌక : చెరలో 25 మంది
గాజా : గాజాలో ఇజ్రాయిల్ దాడులు మరింత విస్తృతమవుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ బలగాల భీకర దాడులకు మరో ఆస్పత్రి బలైంది. గాజాలోని ఇండోనేషియా ఆస్పత్రిపై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో 12మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి లోపల ఆశ్రయం పొందినవారు ఆస్పత్రి వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా వారిపై బలగాలు కాల్పులు జరిపాయని, మృతదేహాలన్నీ ఎక్కడికక్కడ నేలపై చెల్లాచెదురుగా పడి వున్నాయని, మృతదేహాలను ఖననం చేసే పరిస్థితి కూడా లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి చుట్టూ ఇజ్రాయిల్ ట్యాంక్లు చుట్టుముట్టాయి. ఆస్పత్రిలో దృశ్యాలు బీభత్సంగా వున్నాయి. కాగా ఐసియుల్లోని నవజాత శిశువులను వైద్యం కోసం ఈజిప్ట్కు తరలించారు. ఇప్పటివరకు అల్షిఫా ఆస్పత్రి నుండి నెలలు నిండకుండా పుట్టిన 31మంది శిశువులను తరించినట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.
మరోవైపు అల్ కువైట్ యుఎన్ స్కూలును కూడా తగలబెట్టేశారు. గాజా ప్రజలు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే అక్కడ మృతుల సంఖ్య ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఈ దాడిని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెటినో మార్సుది ఖండించారు. అంతర్జాతీయ మాన వతా చట్టాలను ఇది తీవ్రంగా ఉల్లంఘించడమేనన్నారు. అన్ని దేశాలు ముఖ్యంగా ఇజ్రాయిల్తో సన్నిహిత సంబంధా లు కలిగిన దేశాలన్నీ తన పలుకుబడిని, సామర్ధ్యాలను ఉపయోగించి ఈ దారుణాలను ఆపేలా చూడాలని రెటినో కోరారు. మరోవైపు అదనపు ప్రాంతాలకు తమ ఆపరేషన్ను విస్తరిస్తున్నామని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించింది. జాబాలియా శరణార్ధ శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడ నుండి ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా, ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్కు చెందిన సరుకుల రవాణా నౌకను యెమెన్లోని హుతీ రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని 25మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో ఘర్షణలు ఇతర ప్రాంతాలకూ వ్యాపిస్తాయనే ఆందోళన ముదురుతోంది.
అరబ్, ముస్లిం మంత్రుల టూర్
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని అరబ్, ముస్లిం మంత్రులు సోమవారం పిలుపిచ్చారు. గాజాలో ఘర్షణలను నివారించేందుకు జరుపుతున్న పర్యటనలో భాగంగా సోమవారం వారు బీజింగ్లో పర్యటిం చారు. గాజాలో మానవతా సంక్షోభం తలెత్తకుండా ప్రపంచ దేశాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొ న్నారు. గాజాలో యుద్దాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిం చేందుకు గల అవకాశాలపై మంగళవారం మాస్కోలో అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రాన్స్్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సోమవారం గాజాలో పరిస్థితులపై ఫోన్లో చర్చించారు. మరింత తీవ్రమైన మానవతా సంక్షోభం పెచ్చరిల్లకుండా నివారించడానికి చర్యలు తీసుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. అల్షిఫా ఆస్పత్రిలోనే హమస్ బందీలను దాచిందని ఆరోపిస్తూ ఇజ్రాయల్ రక్షణ బలగాలు సోమ వారం ఒక వీడియోను విడుదల చేశాయి. అయితే హమస్ వాటిని ఖండించింది. కాగా, హమస్ చెరలోని 240మంది బందీల ను విడిపించేందుకు ఒప్పందం కుదిరే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కతార్ మధ్యవర్తులు తెలిపారు.
నవంబరు 20ని ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తారు. బాలల హక్కులు, భద్రత, విద్య , ఆరోగ్యం, సంతోషం కోసం అంతర్జాతీయంగా నిర్వహించే ఈ రోజున గాజాలో పరిస్థితి దారుణంగా వుంది. ఇప్పటివరకు 5500మంది చిన్నారులు దాడులకు బలయ్యారు. ప్రతి పది నిముషాలకు ఒక్కో చిన్నారి కన్నుమూశాడు.
నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా సిబ్బంది మృతి
ఇజ్రాయిల్ దాడుల్లో గడిచిన 24గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు స్థానిక మీడియా సిబ్బంది మరణించారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో దాదాపుగా 40మంది జర్నలిస్టులు మరణించారు. సెంట్రల్ గాజా లోని అల్ బురీజ్ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబుదాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సారి మన్సూర్, హసౌ నెV్ా సలీంలు మృతి చెందారు. బిబిసికి చెందిన మరో ప్రముఖ పాత్రికేయుడు, పాలస్తీనా రాజకీయ వ్యవహారాల విశ్లేషకు డు ముస్తఫా అల్ సవాఫ్ కూడా చనిపోయారు. ఆయన నివాసం లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన మరణించారు. స్థానిక ఫోటో జర్నలిస్ట్ ముసాబ్ అషౌర్, అల్ అక్సా రేడియోలో పని చేసే వ్యక్తి అబ్దుల్హమిద్ అవద్, అల్ అక్సా టెలివిజన్ ఛానెల్కి చెందిన అమర్ అబు హయ్యాలు కూడా ఈ దాడుల్లో కన్నుమూశారు. మృతుల్లో ప్రెస్ హౌస్ డైరెక్టర్ బిలాల్ జదల్లా కూడా ఉన్నారు. గాజా సిటీలోని ఆయన కారుపై బాంబులు వేసినట్లు హమాస్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ తెలిపింది. గాజాపై ఇజ్రాయిల్ దాష్టీకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు తమ వార్తా కవరేజీ సందర్భంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.