– బాలుడి మృతి కలిచివేసింది :జవహర్నగర్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ జవహర్నగర్లో వీధి కుక్కల దాడిలో రెండేండ్ల బాలుడు మృతి చెందడం తనను కలిచి వేసిందని సీఎం ఏ.రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులా లేక సీజనల్ అంశాలు కారణమా అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు టీకాలు వేయటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో కుక్క కాటుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవా లనీ, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.