– సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్లపై ఎస్బీఐ అభ్యర్థన
– 11న విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించేందుకు మరింత గడువు కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మార్చి 11న విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు, ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోపు ఈసీకి సమర్పించాలంటూ గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఎస్బీఐపై ఏడీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పైనా అదేరోజు వాదనలు విననుంది.కాగా ఎస్బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన సంగతి విదితమే. లోక్సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే బ్యాంకు అధికారులు గడువు కోరుతున్నారనిఅసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఆరోపిస్తోంది.