తీవ్ర అధికార దుర్వినియోగం !

తీవ్ర అధికార దుర్వినియోగం !– 22న ఒక పూట సెలవుపై సీపీఐ(ఎం) విమర్శ
న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిరంలో జరిగే రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక పూట సెలవును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. ఇది అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొంది. మధ్యాహ్నం 2.30గంటల వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మూతబడతాయని ప్రకటిస్తూ ప్రభుత్వం ఆఫీస్‌ మెమోరాండం జారీ చేసింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన చర్యలు తీసుకున్నాయని తెలుస్తోంది. పూర్తిగా మతపరమైన కార్యక్రమంగా జరపడానికి బదులుగా ఇందులో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే చర్యలివని పొలిట్‌బ్యూరో పేర్కొంది. తమ మత విశ్వాసాలు, వ్యవహార శైలికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే హక్కు ఉద్యోగులకు వుంటుందని, కానీ ఇటువంటి సర్క్యులర్‌ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం తన అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేసిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వానికి ఎలాంటి మతపరమైన రంగు అంటరాదని పేర్కొంటున్న రాజ్యాంగానికి, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చర్యలు వున్నాయని సీపీఐ(ఎం) పునరుద్ఘాటించింది.