నవతెలంగాణ – విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలనుంది. క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తర్వాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షం కురుస్తోంది. విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో గోపాలపట్నం ఇందిరానగర్లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జీవీఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టింది.