– రోహిత్ వేముల కేసుపై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎనిమిదేండ్ల క్రితం కొంతమంది బీజేపీ నేతలు, హెచ్సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు వేధింపులు, మానసిక హింస, వివక్షకు గురై హెచ్సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన కులంపై జిల్లా కలెక్టర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే రాష్ట్ర పోలీసులు హడావుడిగా అత్యుత్సాహంతో తప్పుడు నివేదికను హైకోర్టుకు సమర్పించడం వెనుక నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు, హెచ్సీయూ వైస్ చాన్సలర్పై ఉన్న కేసులను ఎత్తేయించడానికేనని విమర్శించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నివేదిక ఆధారంగా కేసును మూసేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసును పునర్విచారణ చేపడుతున్నట్టు రాష్ట్ర డీజీపీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామంటూ ఆయన తల్లికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఈ కేసును రాజకీయ అంశంగా చూడకుండా సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలనీ, ఇలాంటి ఘటనలు ఏ విశ్వవిద్యాలయంలోనూ పునరా వృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తమ్మినేని విజ్ఞప్తి చేశారు.