– నేటి నుంచి విడతలవారీగా.. సెప్టెంబర్ రెండో వారానికి పూర్తి
– సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చాలా కాలంగా రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీకి సర్కారు గ్రీన్ సిగల్ ఇచ్చింది. గురువారం రైతు రుణమాఫీని పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ…సెప్టెంబర్ రెండో వారంలోపు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సంక్షేమం,
వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా పరిస్థితుల్లో తలెత్తిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన కక్షపూరిత చర్యలు…తదితర కారణాలతో రుణమాఫీ కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కదిద్దుకున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘాటంగా కొనసాగిస్తున్నదని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని విస్మరించే ప్రసక్తేలేదన్నారు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. తద్వారా రైతు సాధికారతను సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని సీఎం వివరించారు.