వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి

– మరియం ధావలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమపై జరుగుతున్న దాడులను ఎదుర్కునేందుకు ఆడపిల్లలు కరాటేలాంటి శిక్షణ ద్వారా ఆత్మస్తైర్యాన్ని పెంచుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలె పిలుపునిచ్చారు. ఐలమ్మ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా పిల్లలకు ఉచిత కరాటే శిక్షణను ఇస్తున్న నేపథ్యంలో వీరికి పోటీలు నిర్వహించి ఇందులో గెలుపొందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. బ్లాక్‌ బెల్టు వచ్చే వరకు శిక్షణను పొందాలని సూచించారు. వ్యక్తి గత జీవితంలో క్రమ శిక్షణగా ఉంటూ విద్యలో మొదటి స్థానం సంపాదించాలని కోరారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షులు పీకే శ్రీమతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ట్రస్ట్‌ కార్యదర్శి బి హైమావతి, కెఎన్‌ ఆశాలత, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.