నవతెలంగాణ-ఓయూ
ప్రముఖ సినీ, నేపధ్య గాయకుడు, జానపద బ్రహ్మ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం సికింద్రాబాద్ చిలకలగూడలోని ఆయన నివాసంలో మృతి చెందారు. అనంతరం ఆయన అంత్యక్రియలు సీతాఫల్మండి శ్మశాన వాటికలో జరిగాయి. అంత్యక్రియలకు సంగీత దర్శకులు విష్ణు కిషోర్, జానపద కవి, గాయకులు నేర్నాల కిషోర్, గాయనీ గాయకులు స్వర్ణక్క, బోనాల ప్రకాష్, సంపత్, మల్లిక హాజరై సంతాపం తెలిపారు. వడ్డేపల్లికి భార్య, ఒక కూతురు ఉన్నారు. వరంగల్ జిల్లాలో జన్నించిన వడ్డేపల్లి చిన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో మొట్టమొదటి జానపద కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ‘గరం గరం పోరీ నా గజ్జెల సవ్వారీ’ అనే పాటతో ‘నమస్తే అన్న’ చిత్రం ద్వారా సినీ నేపధ్య గాయకుడిగా పరిచయమయ్యారు. అనంతరం నాగార్జున నటించిన కింగ్ సినిమాలో ‘గింత గింత పాలసుక్కకే’ అనే పాట పాడి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. పవన్కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్సింగ్ సినిమాలోని ‘పిల్లా నువ్వులేని జీవితం’ పాటతో వడ్డేపల్లి శ్రీనివాస్కు ఎంతో పేరు వచ్చింది. ఈ పాటకు ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. దాదాపు 100కు పైగా సినీ గీతాలు, ప్రయివేట్గా ఎన్నో ఫోక్ సాంగ్స్ ఆయన ఆలపించారు. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.