– భయంతో బయటకు పరుగులు తీసిన రోగులు
నవతెలంగాణ-నిర్మల్టౌన్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్ జనరల్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో వైద్యులు, రోగులు భయాందోళనలో పరుగులు పెట్టారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది, పేషెంట్ల అటెండెంట్లు రోగులను వార్డు నుంచి సురక్షితంగా బయటికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండో వార్డులోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బందికి ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.