ఢిల్లీ ఐటీ ఆఫీసులో అగ్ని ప్రమాదం

ఢిల్లీ ఐటీ ఆఫీసులో అగ్ని ప్రమాదం– ఒక ఉద్యోగి మృతి
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఒక ఆదాయ పన్ను కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మరణించారు. మంగళవారం మధ్యాహ్నం సెంట్రల్‌ రెవిన్యూ భవనంలో ఉన్న ఆదాయ పన్ను కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 21 అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏడుగురిని కార్యాలయం నుంచి రక్షించారు. ఒక వ్యక్తి స్పృహ తప్పి ఉండగా గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతున్ని 46 ఏళ్ల ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా గుర్తించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.