తెలంగాణకు 12 ,ఏపీకి ఐదు

– తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ కాలేజీలకు కేంద్రం ఆమోదం
– ఒక్కో కాలేజీలో 150 సీట్లు
– దేశవ్యాప్తంగా 50 కాలేజీలకు ఆమోదం : కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ
నవతెలంగాణ’ -న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణకు 12 , ఆంధ్రప్రదేశ్‌కు 5 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గురువారం దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలోని మేడ్చల్‌, వరంగల్‌, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, అసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం, హైదరాబాద్‌ లో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. మేడ్చల్‌- మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్‌, మేడ్చల్లో సీఎంఆర్‌ ట్రస్ట్‌, వరంగల్‌ కొలంబో ట్రస్ట్ల ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.