ఎమ్మెల్సీ ఎన్నికకు ఐదు నామినేషన్లు

నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్‌
వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు 7 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న 2 సెట్ల నామినేషన్‌ వేశారు. ఆయన వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకట్‌ రెడ్డి ఒక సెట్‌, చాలిక చంద్రశేఖర్‌ 2 సెట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. అలియన్స్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరిరావు ఒక సెట్‌, తెలంగాణ సకలజనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను నల్లగొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సిహెచ్‌.మహేందర్‌ జీకి అందజేశారు.