స్నేహితుడి కోసం..

స్నేహితుడి కోసం..పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఐస్‌ క్రీమ్‌లను రుచితో పాటు నాణ్యతతో అందించడమే లక్ష్యంగా ‘డెయిరీ ట్రెండ్స్‌’ అనే సంస్థను స్థాపించారు శ్యాంసుందర్‌ రెడ్డి. శుక్రవారం అమీర్‌పేట్‌ మ్యారిగోల్డ్‌ హోటల్‌లో డెయిరీ ట్రెండ్స్‌ సంస్థ లోగో, ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, హీరో విశ్వక్‌సేన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ,’రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్ళడంలో, ఉపాధి కల్పనలో ప్రైవేట్‌ రంగ సంస్థలు, వ్యాపార పరిశ్రమలు ఎంతో కీలకం’ అని తెలిపారు. ‘ఇది కమర్షియల్‌ ఈవెంట్‌ కాదు. నా స్నేహితుడి కోసం ఇక్కడకు వచ్చాను. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఇద్దరం కలిసి చదువుకున్నాం. నాకు లాంచింగ్‌ విషయం తెలియగానే, నేనే వస్తా అని చెప్పా. ‘లైలా’ షూటింగ్‌ కోసం నైట్‌ షెడ్యూల్స్‌ జరుగుతున్నాయి. లుక్‌ రివీల్‌ కాకూడదని అనుకున్నా. కానీ మాస్క్‌ పెట్టుకుని వస్తే బాగోదని ఇలా వచ్చేశా. డెయిరీ ట్రెండ్స్‌ ఐస్‌ క్రీమ్‌ బ్రాండ్‌ బాగా పాపులర్‌ అవ్వాలి. నా మిత్రుడికి మంచి పేరు తీసుకురావాలి. ఐస్‌ క్రీమ్‌ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన అన్ని ఫ్లేవర్స్‌ కూడా డెయిరీ ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నేను కూడా టేస్ట్‌ చేశాను. అన్ని ఫ్లేవర్స్‌ చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందరూ తప్పకుండా టేస్ట్‌ చేయండి’ అని విశ్వక్‌సేన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ట్రెండ్స్‌ సీఈవో శ్యాంసుందర్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.