‘ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నా’ అన్నారు మదర్థెరిస్సా. అలా ఆమె చేతులు పదహారేండ్లలో వెయ్యి మంది వికలాంగులకు సాయం చేశాయి. ఆ సాయం వారి జీవితాన్నే మార్చివేసింది. ఆమే పుష్పా. వికలాంగులకు చేయూతనిస్తే వారి ఆత్మగౌరవంతో బతుకుతారు. అలాంటి గౌరవమైన జీవితాన్ని వారు అనుభవించేందుకు పరీక్షలు రాసి సహకరిస్తున్నారు. ఈ రోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
2007లో బెంగళూరులో రోడ్డు దాటించాలని పుష్పను ఓ అంధుడు అడిగారు. రోడ్డుకు అవతలి వైపుకు చేరుకున్న తర్వాత ఆమెను ‘నా ఫ్రెండ్కు పరీక్ష రాయడంలో సాయం చేయగలరా’ అని మరో సాయం అడిగారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. అయితే పరీక్ష రాసే రోజు వచ్చినప్పుడు ఆమె ఆందోళన చెందారు. ఎందుకంటే అంధులకు సాయంచేసే ‘స్క్రైబ్’గా ఆమె శిక్షణ తీసుకోలేదు. ఆ పరీక్ష ఎలా రాస్తారో ఆమెకు పెద్దగా అవగాహన లేదు. ‘ఆ మూడు గంటలపాటు కొంత ఆందోళన చెందాను. ఆమె కాస్త నెమ్మదిగా సమాధానాలు చెప్పేవారు. ప్రశ్నను మళ్లీ మళ్లీ చదవాలని ఆమె అడిగేవారు’ అని పుష్ప పంచుకున్నారు.
16 ఏండ్లలో వెయ్యికి పైగా
తర్వాత 19 ఏండ్ల హేమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన సాయం పుష్ప చేయగలి గారు. ఆ తర్వాత అంధుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల నుంచి ఆమెకు అభ్యర్థనలు వెల్లువెత్తాయి. గత 16 ఏండ్లలో ఆమె వెయ్యికి పైగా ఇలాంటి పరీక్షలు రాశారు. వీటి కోసం ఆమె ఎలాంటి డబ్బులూ తీసుకోలేదు. స్కూలు, యూనివర్శిటీ పరీక్షలతోపాటు ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లోనూ పుష్ప సాయం చేస్తున్నారు. ‘పరీక్ష కేంద్రాలు నాకు రెండో ఇల్లులా మారిపోయాయి. ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడీ లేదు’ అంటున్నారు. చరిత్ర నుంచి స్టాటిస్టిక్స్ వరకు చాలా సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఈ పరీక్షలే తనకు సాయం చేశాయని చెబుతున్నారు. అంధులతోపాటు సెరెబ్రల్ పాల్సీ, డౌన్స్ సిండ్రోమ్, ఆటిజం, డిస్లెక్సియా, రోడ్డు ప్రమాదాల వల్ల పరీక్షలు రాయలేనివారికి కూడా ఆమె సహకరిస్తున్నారు.
ఒక్కరికే 47 పరీక్షలు
మొదట్లో సెరెబ్రల్ పాల్సీ బాధితులు చెప్పేవి అర్థం చేసుకోవడంలో ఆమె ఇబ్బంది పడేవారు. ‘వారి విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. పెదాల కదలికలు చూసి వారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవాలి’ అని పంచుకున్నారు. మొదట్లో కొంత తడబడినప్పటికీ వీల్చైర్ సాయంతో కదిలే కార్తీక్ కోసం ఆమె చాలా పరీక్షలు రాశారు. ‘స్కూల్లో చివరి పరీక్షలతో మొదలుపెట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్లో అన్ని పేపర్లూ అంటే మొత్తంగా 47 పరీక్షలు తన కోసం రాశాను’ అని పుష్ప చెప్పారు. ‘స్కూల్ పరీక్షల సమయంలో వేరే వారికి పరీక్షలు రాయడానికి పుష్ప వచ్చారు. నాకు వేరొకరు సాయం చేస్తున్నారు. అయితే ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పుష్ప తన పని పూర్తిచేసుకొని నాకు సాయం చేయడానికి వచ్చారు. మేం చేతితో రాయలేం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే మా చేతులు చాలా నెమ్మదిగా కదులుతాయి. ఇంత సాయం చేస్తున్న ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని 25 ఏండ్ల కార్తీక్ అన్నారు. ఏండ్లపాటు కలిసి పనిచేయడంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా పెనవేసుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన కార్తీక్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు.
జీవితాన్ని మార్చిన సాయం
‘నేను చాలా మంది విద్యార్థులకు చాలా పరీక్షలు రాశాను. ఒక్కొక్కరిది ఒక్కో కథ’ అంటారు ఆమె. మార్చి మూడో వారంలో 19 ఏండ్ల భూమికా వాల్మీకికి యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో పుష్ప సాయం చేశారు. భూమికకు దృష్టిలోపం ఉంది. దీంతో అక్షరాలను వాయిస్ లోకి మార్చే టూల్స్, యాప్స్ సాయంతో ఆమె చదువుకున్నారు. అయితే పరీక్షల్లో ఇలాంటి టూల్స్ ఉపయోగించడానికి వీల్లేదు. ‘పుష్ప పరీక్ష రాస్తేనే జీవితంలో నేను ముందుకు వెళ్లగలను. ఆమెకు సహనం ఎక్కువ. అన్ని సమాధానాలు పూర్తయ్యేవరకు మాతోనే కూర్చుంటారు. అసలు విసుక్కోరు. రాసేముందుగా సమాధానాన్ని నాకు ఒకసారి చదివి వినిపిస్తారు’ అని భూమిక వివరించారు.
వారు తప్పు చెప్పినా అలాగే రాయాలి
పుష్ప దగ్గరకు సాయం కోసం వచ్చేవారిలో చాలా మంది యూనివర్సిటీలో ప్రవేశం కోసం బాగా కష్టపడుతుంటారు. వారిని చూస్తే జాలి వేసినప్పటికీ, నిజాయితీతోనే తాను ముందుకు వెళ్తానని ఆమె చెప్పారు. ‘వారు చెప్పింది రాయడం నా విధి. తప్పు సమాధానం చెప్పినప్పుడు లేదా వాక్య నిర్మాణ దోషాలు చెప్పినప్పుడు నేను అలానే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను జోక్యం చేసుకోకూడదు. కొన్నిసార్లు పిల్లలు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వారికి నేను వారి మాతృభాషలో వివరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అది మాత్రమే నేను చేయగలిగే సాయం’ అని ఆమె అన్నారు. విద్యార్థి కోసం ఒక పరీక్ష నిర్వాహకుడు ఉంటారు. కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తారు. యూనివర్సిటీలో అదే సబ్జెక్టు చదువుకున్న వారిని పరీక్షల్లో సాయం చేయడానికి అనుమతించరు.
పేద కుటుంబం నుంచి
పుష్ప కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పుట్టారు. వారిది నిరు పేద కుటుంబం. తండ్రి ఓ ప్రమాదానికి గురై పని చేయలేకపోయేవారు. పుష్పకు ఓ తమ్ముడు ఉన్నాడు. తల్లే కష్టపడి వీరిద్దరినీ పెంచింది. ‘ఒకానొక సమయంలో ఫీజులు కట్టలేక బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫీజు కట్టి సాయం చేశారు. అందుకే నేను కూడా ఈ రూపంలో సేవ చేసి ఆ కృతజ్ఞతను తీర్చుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పుష్ప, ఆమె సోదరుడు కొరియర్ కంపెనీల్లో ఉద్యోగానికి చేరారు. దూర విద్య ద్వారానే పుష్ప డిగ్రీ పూర్తిచేశారు. కంప్యూటర్ సైన్స్లో ఆమెకు డిప్లొమా కూడా ఉంది.
వరుస సమస్యలు
ఇటీవల కాలంలో పుష్ప చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2018లో తండ్రి చనిపోయారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల తమ్ముడిని కూడా ఆమె కోల్పోయారు. ఏడాది తర్వాత ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఊహించని విధంగా తల్లి కూడా మరణించారు. ‘మే 2021లో అమ్మ చనిపోయారు. కొన్ని నెలల తర్వాత, అంటే ఆగస్టులో నేను 32 పరీక్షలు రాశాను. ఒక్కోసారి రోజుకు రెండు పరీక్షలు కూడా రాసేదాన్ని. నా కష్టాలు, బాధలు మరిచిపోవడానికి ఈ పరీక్షల్లో చేసిన సాయం చికిత్సలా పనిచేస్తుంది’ అని ఆమె తెలిపారు.
ఐదు భాషల విద్యార్థులకు సాయం
వికలాంగులకు ఇలా పరీక్షలు రాయడంతో పుష్పకు గుర్తింపు కూడా వచ్చింది. మహిళలకు సాధికారత కల్పిస్తున్నందుకు నేషనల్ అవార్డును ఆమె అందుకున్నారు. ‘2018 మార్చి 8న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును నేను తీసుకున్నాను’ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఈవెంట్లలో మోటివేషన్ స్పీచ్లు కూడా ఇస్తుంటారు. ఇప్పటికీ ఆమె పరీక్షలు రాయలేని వారికి సాయం చేస్తూనే ఉన్నారు. తమిళం, కన్నడ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ.. ఇలా ఐదు భాషల విద్యార్థులకు ఆమె సాయం చేస్తున్నారు. ‘నా సమయం, శక్తిని వారి కోసం కేటాయిస్తుంటాను. నేను ఒకరి కోసం పరీక్ష రాస్తున్నానంటే, వారి జీవితం మారుతుంది’ అని ఆమె సంతోషంగా చెబుతున్నారు.