– తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద కష్టాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.ఐదు లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడాననీ, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారంటూ ప్రధానమంత్రి వివరించారని తెలిపారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామంటూ ప్రధాని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయినా తనవంతు సహకారంగా వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.ఐదు లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.ఐదు లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించానని వివరించారు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత కూడా పెద్దఎత్తున ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొవాలని సూచించారు.
తమ కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు అందజేశారని వివరించారు. తమ కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు అందజేశారని తెలిపారు.