క్రికెట్‌ బెట్టింగ్‌.. నలుగురి అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌.. నలుగురి అరెస్ట్‌– రూ.20 లక్షలు స్వాధీనం
– రూ.3,85,000 బ్యాంక్‌లో ఫ్రీజ్‌
– పరారీలో నలుగురు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు ప్పాలడుతున్న 8 మంది ముఠాలోని నలుగురిని హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బ్యాంక్‌ అకౌంట్లు, ఐదు సెల్‌ఫోన్లతోపాటు రూ.20లక్షలు స్వాధీం చేసుకున్నారు. మరో రూ.3,85,000ను బ్యాంక్‌లో ఫ్రీజ్‌ చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ తరున్‌ జోషీ తెలిపిన వివరాల ప్రకారం..
హస్తినాపురానికి చెందిన వ్యాపారి టి.కార్తీక్‌ రెడ్డి, కర్మాన్‌ఘాట్‌కు చెందిన వ్యాపారి కె.అభిషేక్‌ రెడ్డి, పి.యాదగిరి, ఎం.రాజవర్ధన్‌ రెడ్డితోపాటు మరో నలుగురు కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలని ఐపీఎల్‌ మ్యాచ్‌లపై దృష్టి సారించారు. పోలీసులకు చిక్కకుండా హస్తినాపురంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని క్రికెట్‌ బెట్టింగ్‌ పెడుతున్నారు. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్‌ కాశారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఎల్బీనగర్‌ పోలీసులతో కలిసి హస్తినాపురంలో ప్రత్యేక నిఘా వేశారు. డీసీపీలు మురళీధర్‌, ప్రవీన్‌కుమార్‌ ఆదేశాలతో దాడులు చేసి నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రవీణ్‌, చైతన్య, మనోజ్‌, సందీప్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు.