– కెబి సింగ్ను విచారిస్తున్న సీబీఐ
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు గెయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కెబి సింగ్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఈ కేసులో వడోదరకు చెందిన అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ సురేందర్ కుమార్తో సహా మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులలో రూ.50 లక్షలు తీసుకుని కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహారించారనే లంచం కేసులో కెబి సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం నుంచి అంగుల్, విజయపూర్ నుంచి ఔరయ్య అనే రెండు పైప్లైన్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించినందుకు లంచం చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. లంచం మార్పిడికి సంబంధించి సీబీఐకి సమాచారం అందడంతో సోమవారం నుంచి విచారణ ప్రారంభించి అరెస్టులు చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, నోయిడా, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.