
– బీజేపీ నేత కుమారుడి అఘాయిత్యం..
– మధ్యప్రదేశ్లో శృతిమించుతున్న కాషాయపార్టీ నేతల ఆగడాలు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. యువతి సోదరి పైనా కూడా వారు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత యువతి ఆత్మహత్యకు యత్నించింది. తమపై జరిగిన దారుణంపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. ఓ యువకుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితులందర్నీ అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితుల బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిందితుల్లో బీజేపీ ఆఫీస్ బేరర్ కుమారుడి (మైనర్) పేరు ఉండటంతో రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది. ‘తనతోపాటు తన సోదరిని నలుగురు యువకులు అపహరించారు. అనంతరం ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సోదరిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తననూ లైంగికంగా వేధించారు’ అని శుక్రవారం బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ వెల్లడించారు. అనంతరం ఇరువురు ఇంటికి చేరుకున్న తర్వాత.. బాధిత యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం ఆమె ఝాన్సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సామూహిక లైంగికదాడి, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నాలుగో వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేల రివార్డును ప్రకటించామన్నారు.