గెహ్లాట్‌ నామినేషన్‌ రద్దు చేయాలి..

గెహ్లాట్‌ నామినేషన్‌ రద్దు చేయాలి..–  నేర చరిత్రను దాచిపెట్టారంటూ బీజేపీ ఫిర్యాదు
జైపూర్‌ : రాజస్థాన్‌లో రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ గెహ్లాట్‌ను ఇరకాటంలో పెట్టే చర్యలను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగానే అశోక్‌ గెహ్లాట్‌ నామినేషన్‌లో తప్పుందని, నేర వాస్తవాలను దాచి పెట్టారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడ రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది.
ఏం జరిగిందంటే…
రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నామినేషన్‌లో క్రిమినల్‌ కేసులను దాచిపెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి, ముఖ్యమంత్రి తరపున వాస్తవాలను దాచిపెట్టినందుకు సర్దార్‌పురా రిటర్నింగ్‌ అధికారి సంజరు కుమార్‌ బసుకి బీజేపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి సమాచారం కోరారు. ఈ ఫిర్యాదు తర్వాత ముఖ్యమంత్రి గెహ్లాట్‌ నామినేషన్‌ రద్దు చేయవచ్చా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మంగళవారం నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి దానిని తిరస్కరించలేదు.
సీఎం గెహ్లాట్‌ నాలుగు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు, తద్వారా ఏదైనా పొరపాటు జరిగితే, రెండవ పేపర్‌ను పరిశీలించవచ్చు.
గెహ్లాట్‌పై కోర్టులో ఐదు కేసులు నడుస్తున్నాయి. కానీ గెహ్లాట్‌ అన్ని కేసులను ప్రస్తావించలేదు. ఢిల్లీలోని రెండు కేసుల ప్రస్తావనా లేదు. కానీ తన అఫిడవిట్‌లో ఐదు కేసులకు బదులు మూడు కేసులను ప్రస్తావించారు. వీటిలో ఒకటి ఢిల్లీకి చెందినది. మరో రెండు జైపూర్‌కు చెందిన కేసులని తెలుస్తోంది. ఈ విషయమై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు గుప్తా తెలిపారు. ఈ అంశంపై తర్వాత విచారణ చేపడతారు.
రెండు కేసుల్లో దాగి ఉన్న వాస్తవాలు
మొదటి క్రిమినల్‌ కేసు సెప్టెంబర్‌ 8, 2015 నాటిదని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. జైపూర్‌లోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. లేఖలో ఎఫ్‌ఐఆర్‌ సంఖ్య 409/2015గా పేర్కొనబడింది. సెక్షన్‌ 166, 409, 420, 467, 471, 120బి కింద కేసు నమోదు చేశారు. గెహ్లాట్‌ తన నామినేషన్‌లో దీని గురించి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీని తదుపరి విచారణ 24 నవంబర్‌ 2023న షెడ్యూల్‌ చేయబడింది. రెండో కేసు 31 మార్చి 2022 నాటిదిగా నివేదించబడింది. ఇందులో ఫిర్యాదుదారుడి ప్రకారం, అశోక్‌ గెహ్లాట్‌ , ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. రాజస్థాన్‌ హైకోర్టులో ఫిర్యాదులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు