– జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్
నవతెలంగాణ- పాల్వంచ
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం 1994 ఆక్ట్ పీసీఅండ్పీఎన్డీటీ సంబంధించి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ వారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా ఈ యాక్ట్ను అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా సరైన కారణం లేకుండా అబార్షన్ నిర్వహిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని, కమిటీ నిర్ణయించింది. ఎవరికైనా పర్మిషన్ ఇస్తే అన్ని రకాల ధ్రువపత్రాలు సమర్పిస్తేనే వారికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించుట కోసం ఐయిసీ మెటీరియల్ ప్రింట్ చేసి పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఓఎంసీహెచ్ డాక్టర్ చైతన్య, డాక్టర్ అనూష, పార్వతి అడ్వకేట్, డాక్టర్ కోరా శ్రీ యాదవ్, ఎండీ అజ్గర్ హుస్సేన్, డీపీఆర్ఓ, ఎండీ, ఫైయాస్ మోహిద్దీన్ డిప్యూటీ, డెమో, పి.శ్రీనివాసరావు, డీపీఎంఓ టి.విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.