– ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు న్యాయమైన వాటా ఇవ్వాలి : ఇందిరాపార్కు వద్ద ధర్నాలో ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు దక్కాల్సిన వాటా వారికి దక్కాల్సిందే..అందుకు ఆటంకంగా ఉన్న జీవో 3ను వెంటనే రద్దు చేయాలని భారత్ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ దగ్గర భారత్జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని చెప్పారు. కోర్టు తీర్పు పేరుతో ఆయన తప్పించుకున్నారన్నారు. జీవో 3 నిజమైతే 30వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారన్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరనీ, తమ పోరాటం మహిళలకు న్యాయం కోసమేగానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు ధర్నా చేయాల్సి రావటం సిగ్గుచేటని విమర్శించారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్ డే రోజున ఆడబిడ్డల ఉద్యోగాలకై ధర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేషన్ను పెంచుకున్నామన్నారు. గతంలో వ్యక్తిగతంగా చనిపోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేశాడని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారని విమర్శించారు. వికలాంగులు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కాస్త ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగే ఏ ఒక్క కార్యక్రమం బీఆర్ఎస్ చేయలేదని వెల్లడించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దుచేసి, హైకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకువెళ్తున్నదని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా నిలదీస్తామని స్పష్టం చేశారు. జీవో 3 వల్ల గురుకులాల్లో మహిళలకు 12 శాతం ఉద్యోగాలే వచ్చాయన్నారు. తనకే అన్ని చట్టాలు తెలుసన్నట్టు సీఎం వ్యవహరిస్తారని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి ఇలా చేస్తే..మూన్నెళ్ల ముఖ్యమంత్రిగానే ఉంటారనీ, ఆయన రేసుగుర్రంకాదనీ గుడ్డి గుర్రమని విమర్శించారు.